Studio18 News - అంతర్జాతీయం / : Nepal Bus Accident : నేపాల్లో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పుర్ కు చెందిన పర్యటక బస్సులో డ్రైవర్, ఇద్దరు సహాయకులు సహా మొత్తం 43 మంది నేపాల్ లోని పొఖరా నుంచి ఖాట్మాండుకు బయలుదేరారు. తనహూ జిల్లాలోని అంబూ ఖైరేనీ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి రహదారి పక్కన 150 అడుగుల లోతున ఉధృతంగా ప్రవహిస్తున్న మార్సయాంగడీ నదిలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ప్రమాదంతో 16మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మిగిలినవారు గల్లంతు కావడంతో రెస్క్యూ సిబ్బంది వారిని ఒడ్డుకు చేర్చారు. తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా 25మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మృతులంతా మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. మృతదేహాలను భారత్ కు తీసుకొచ్చేందుకు ఎయిర్ ఫోర్స్ విమానం నేపాల్ వెళ్లనుంది. పది రోజుల పర్యటనలో భాగంగా రెండు రోజుల క్రితం భారత్ నుంచి మూడు బస్సుల్లో భారతీయులు నేపాల్ వెళ్లారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా వరణ్ గావ్, భుసావాల్ తదితర ప్రాంతాల నుంచి 104 మంది నేపాల్ పర్యటనకు వెళ్లారని, పొఖారాలో రెండు రోజులు పర్యటించి ఖాట్ మాండూకు పయనమైన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నేపాల్ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు.
Admin
Studio18 News