Studio18 News - సినిమా, టీవీ & ఓటీటీ / : రేఖ పెళ్లి రహస్యాన్ని బయటపెట్టిన స్నేహితురాలు బినా రమణి అమితాబ్తో బంధం ఫలించకపోవడంతోనే ముఖేశ్ ను పెళ్లాడిందని వెల్లడి ముఖేశ్ అభిమానం ఆ సమయంలో రేఖకు ఊరటనిచ్చిందన్న స్నేహితురాలు బాలీవుడ్ లెజెండరీ నటి రేఖ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అత్యంత ఆసక్తికరమే. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్తో ఆమె ప్రేమాయణం, ఆ తర్వాత ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేశ్ అగర్వాల్ను హఠాత్తుగా పెళ్లి చేసుకోవడంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా, రేఖ స్నేహితురాలు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ బినా రమణి ఆ పెళ్లి వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టారు. అమితాబ్తో బంధం ఫలించదనే నిరాశలో ఉన్న రేఖ, జీవితంలో స్థిరత్వం కోరుకునే సమయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు. ఈ విషయమై బినా రమణి మాట్లాడుతూ, "రేఖకు ముఖేశ్ అగర్వాల్ వీరాభిమాని. ఆమె నటించిన ఏ సినిమాలోని డైలాగ్నైనా అప్పజెప్పగలడు. ఆమె జీవితం గురించి అతనికి అన్నీ తెలుసు. సరిగ్గా అదే సమయంలో రేఖ తన జీవితంలో ఒక కొత్త ఆరంభం కోరుకుంది" అని వివరించారు. వారిద్దరినీ తానే ఫోన్ కాల్ ద్వారా పరిచయం చేశానని, మొదట రేఖకు ముఖేశ్ ఎవరో కూడా తెలియదని ఆమె గుర్తుచేసుకున్నారు. "రేఖ అతనితో రెండు మూడు నిమిషాలు మాట్లాడి, అతని నంబర్ తీసుకుంది. తన నంబర్ అతనికి ఇవ్వొద్దని చెప్పి, ఆ తర్వాత తనే కాల్ చేసింది" అని బినా తెలిపారు. వారిద్దరి వ్యక్తిత్వాలు, రూపం పూర్తి భిన్నమని ఆమె పేర్కొన్నారు. "ముఖేశ్ చాలా సాధారణంగా ఉండేవారు. కానీ రేఖ ఒక దివా. వారిద్దరి ఫొటోలు చూశాక, 'నా పక్కన ఇతన్ని ఊహించుకోగలవా?' అని రేఖ నన్ను అడిగింది. ఎందుకంటే ఆమె మనసులో అమితాబ్ రూపం ఉంది" అని బినా అన్నారు. అయితే, ముఖేశ్ చూపిన పిచ్చి ప్రేమ ఆ సమయంలో రేఖకు ఎంతో ఊరటనిచ్చిందని, ప్రేమలో విఫలమైన బాధ నుంచి బయటపడేందుకు అది సహాయపడిందని బినా అభిప్రాయపడ్డారు. అందుకే అంత హఠాత్తుగా పెళ్లి చేసుకున్నారని, వారి పెళ్లి వార్త విని తాను షాక్ అయ్యానని కూడా చెప్పారు. 1990లో రేఖ, ముఖేశ్ అగర్వాల్ వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన కొన్ని నెలలకే ముఖేశ్ ఆత్మహత్య చేసుకోవడంతో వారి వివాహ బంధం విషాదాంతంగా ముగిసిన విషయం తెలిసిందే.
Admin
Studio18 News