
- స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రులు
- పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ అధికారులు
- రాష్ట్రపతి వెంట ఉన్న గవర్నర్ తమిళిసై

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని భారత ప్రధాని ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఆహ్వానం పలికారు. అనంతరం ఆమెకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత గర్భాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని రాష్ట్రపతి దర్శించుకున్నారు.
దర్శనానంతరం ద్రౌపది ముర్ముకు ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. యాదాద్రి పర్యటన సందర్భంగా రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై కూడా ఉన్నారు. మరోవైపు దర్శనానంతరం యాదాద్రి పరిసరాలను రాష్ట్రపతి పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్ ను కూడా తిలకించారు. యాదాద్రిని సందర్శించిన ఐదో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు.