ఢిల్లీ మద్యం కేసు: ఈడీ చార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు

Spread the love
  • ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, శరత్ చంద్రారెడ్డి పేర్లను కూడా చేర్చిన ఈడీ
  • 14,05,58,890 సీసాల మద్యం విక్రయించిన ఇండోస్పిరిట్స్
  • జనవరిలో కవిత ఇంట్లో సమావేశమైన సమీర్ మహేంద్రు
  • చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొన్న అంశాలపై జనవరి 5లోపు వివరణ ఇవ్వాలని సమీర్ సంస్థలకు కోర్టు ఆదేశం
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను చేర్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, పి.శరత్‌చంద్రారెడ్డి, బినయ్‌బాబు, విజయ్ నాయర్, బోయినపల్లి అభిషేక్‌ల నుంచి తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా ఈ చార్జ్‌షీట్‌ను ఈడీ రూపొందించింది.

చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొన్న వివరాల ప్రకారం.. మాగుంట రాఘవ్‌రెడ్డి, కవిత అసలు భాగస్వాములుగా ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థ 14,05,58,890 సీసాల మద్యం విక్రయించి రూ. 192.8 కోట్లు సంపాదించింది. శ్రీనివాసులు రెడ్డి, శరత్‌రెడ్డి, రాఘవ్‌రెడ్డి, కవిత నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్ ఆప్ నాయకుల కోసం విజయ్‌నాయర్‌కు రూ. 100 కోట్ల ముడుపులు ఇచ్చింది. మళ్లీ ఆ సొమ్మును రాబట్టుకునేందుకు ఇండోస్పిరిట్‌లో 65 శాతం వాటాను సౌత్‌గ్రూప్‌నకు ఇచ్చేసింది. ఈ వ్యవహారంలో అరుణ్‌పిళ్లై, ప్రేమ్ రాహుల్ అనే బినామీ ప్రతినిధులతో సౌత్‌గ్రూప్ ఇండోస్పిరిట్‌లోని వాటాను నడిపింది. అలాగే, ఈ కేసుతో సంబంధం ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు.

ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో  సమీర్ ఆమెతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. అరుణ్‌ పిళ్లైతో వ్యాపారం చేయడమంటే కవితతో చేసినట్టేనని సమీర్‌కు హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంలో మొత్తం రూ. 10 వేల కోట్ల ఆదాయం ఉందని అరుణ్ పిళ్లైతో ఆప్ బినామీ విజయ్‌నాయర్ చెప్పారు. పెద్ద తలకాయల కోసం చూస్తున్న సమయంలో శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ మద్యం వ్యాపారంపై ఆసక్తి చూపారు. ఆర్థిక వనరులు, మార్కెటింగ్ విశ్లేషణ కోసం బుచ్చిబాబును ఆయన ఇందులోకి తీసుకొచ్చారు.

కాగా, సమీర్ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీటును రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నిన్న విచారణ చేపట్టగా సమీర్ విచారణకు హాజరయ్యారు. చార్జిషీట్‌లో పేర్కొన్న అంశాలపై తమ అభిప్రాయాలను జనవరి 5లోపు చెప్పాలని ప్రతివాదులైన సమీర్ మహేంద్రు, ఆయనకు చెందిన నాలుగు మద్యం తయారీ, సరఫరా సంస్థలను కోర్టు ఆదేశించింది.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com