
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యాహబ్ (educational hub)దేశానికే తలమానికంగా నిలువ బోతున్నది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మించారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హాబ్ కి ప్రభుత్వం రూ.146 కోట్ల 28 లక్షల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌళిక వసతి సదుపాయాల సంస్థ (TSEWIDC) ఆధ్వర్యంలో పనులు పూర్తయ్యాయి. కేజీ టు పీజీ ఉచిత విద్యావిధానంలో భాగంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే ఆవరణలో అన్నిరకాల విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పీజీ కాలేజీలను ఒకే క్యాంపస్లో నిర్మించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది.గజ్వేల్లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యాహబ్ను నిర్మించారు. దానికి ఒక కిలోమీటర్ దూరంలో 40 ఎకరాల్లో బాలుర కోసం విద్యాహబ్ను ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల్ని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. వివిధ భవనాల మొత్తం విస్తీర్ణం 4,58,902 చదరపు అడుగులు. ప్రపంచశ్రేణి ప్రమాణాలతో, ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు, బోధకులకు ఆహ్లాదంతోపాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపట్టారు.విశాలమైన తరగతి గదుల్లో పగటివేళల్లో సహజసిద్ద వెలుగు ప్రసరించే విధంగా భవనాలను నిర్మించారు.అన్ని తరగతుల వారు ఉపయోగించుకునే విధంగా ఉన్నతస్థాయి ప్రమాణాలతో సైన్స్ ల్యాబులు రూపొందించారు. ఉత్తమ బోధనతోపాటు పోటీ పరీక్షలకు కోచింగ్ ఏర్పాట్లు చేశారు. 1,200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హైటెక్ ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు.