జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు మొయినాబాద్ వెళ్లారు. అక్కడ ఒక రాజకీయ నేతకు చెందిన ఫామ్ హౌస్ లో ఆశ్రయం పొందారు. అక్కడే మద్యం సేవించి సేద తీరారు. అక్కడి నుంచే వేర్వేరు చోట్లకు నిందితులు పరారీ అయినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులు పారిపోయే ముందు ఇన్నోవా కారును ఫామ్ హౌస్ వెనుక దాచిపెట్టి పరారీ అయ్యారు. కారుపై ఉన్న ఎమ్మెల్యే, గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్ను కూడా తొలగించారు. దీంతో పోలీసులు నిందితులకు ఆశ్రయం ఇచ్చిన ఫామ్హౌస్ యజమానిని గుర్తించి అతని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.
మరోవైపు… అమ్నేషియా పబ్లో ప్లస్టూ విద్యార్దులు మద్య రహిత ఫేర్వెల్ పార్టీ చేసుకోటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఓ కార్పోరేట్ విద్యా సంస్ధ..పబ్కు రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే విద్యార్దులు పార్టీ కోసం పబ్ ను ఎంచుకోవటం… అందుకు స్కూల్ యాజమాన్యం అంగీకరించి…అనుమతి కోసం లేఖ ఇవ్వటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ కోణంలో పోలీసులు విద్యా సంస్ధ నిర్వాహకులనూ ప్రశ్నిస్తున్నారు. పార్టీ జరిగిన సమయంలో మొత్తం సీసీటీవీ ఫుటేజీనీ పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.