
ప్రమాదకర రసాయనాలతో పాలు తయారు చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యాపారులు. గుట్టుచప్పుడు కాకుండా కల్తీ పాలను తయారు చేసి, విక్రయించి సొమ్ము చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇటువంటి ఘటనే వరంగల్ నగరానికి సమీపంలోని గూడెప్పహడ్లో ఎన్ఎస్సార్ డైరీ ఫాంలో వెలుగులోకి వచ్చింది. కల్తీ పాల దందా కలకలం చెలరేగింది. ఫుడ్ కంట్రోల్ బోర్డ్ స్పెషల్ టీమ్స్ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. ఆ డైరీ ఫాంలో అధికారులు నాసిరకం పాల ఉత్పత్తులను గుర్తించారు.
ప్రమాదకర రసాయనాలతో పాల దందా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఎన్ఎస్సార్ డైరీ ఫాంపై హైదరాబాద్కు చెందిన ప్రత్యేక బృందాలు దాడులు చేశాయని వివరించారు. గేదె పాలు లేకుండా యూరియా, పౌడర్లు, ఇతర రసాయనాలతో పాలు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. డైరీ ఫాంను సీజ్ చేసిన అధికారులు.. తనిఖీల్లో సేకరించిన పాలు, ఇతర ఉత్పత్తుల శాంపిళ్లను ల్యాబ్కు తరలించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్న ఆ డైరీ ఫాం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.