ప్రభుత్వ వాహనంలో అత్యాచారం సిగ్గుచేటు : ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం కల్గించింది. నగరంలో జరిగిన ఈ ఘటనపై పలు విమర్శలు వస్తున్నాయి. బాలిక మీద జరిగిన గ్యాంగ్ రేప్ కేసుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ప్రభుత్వ వాహనంలో బాలికపై అత్యాచారం జరగడం సిగ్గుచేటు అన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల బరితెగింపులకు అడ్డులేకుండా పోయిందని విమర్శించారు. కేసును నీరుగార్చేందుకు సీఎంవో కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు దర్యాఫ్తులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్ కాగా, మరొకరు మైనర్. దీంతో ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు పంపారు.
అరెస్ట్ అయిన వారిలో ఒకరు మేజర్, మరో ఇద్దరు మైనర్లు ఉన్నారు. మేజర్ ను చంచల్ గూడ జైలుకి తరలించగా, ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ కేసులో ఏ-2 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన అమ్నేషియా పబ్ ను పోలీసులు క్లోజ్ చేయించారు.
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు మొయినాబాద్ కు వెళ్లారు. అక్కడ ఒక రాజకీయ నేతకు చెందిన ఫామ్ హౌస్ లో ఆశ్రయం పొందినట్లు తెలుస్తోంది. అక్కడే మద్యం సేవించి సేద తీరినట్లు సమాచారం. అక్కడి నుంచే వేర్వేరు చోట్లకు నిందితులు పరారైనట్లు పోలీసులు గుర్తించారు.
నిందితులు పారిపోయే ముందు ఇన్నోవా కారును ఫామ్ హౌస్ వెనుక దాచిపెట్టి పరారైనట్లు తెలుస్తోంది. కారుపై ఉన్న ఎమ్మెల్యే, గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్ను కూడా తొలగించారు. దీంతో పోలీసులు నిందితులకు ఆశ్రయం ఇచ్చిన ఫామ్హౌస్ యజమానిని గుర్తించి, అతని వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.