- కేసీఆర్ ను దెబ్బతీసేందుకు మూకుమ్మడి దాడి చేస్తున్నారన్న గుత్తా
- ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిన చరిత్ర షర్మిల కుటుంబానిదని విమర్శ
- మోదీ కన్ను ఇప్పుడు తెలంగాణపై పడిందని వ్యాఖ్య
2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపారని గుత్తా విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలను కూల్చే కుట్రలతో అనిశ్చితకరమైన వాతావరణం ఉందని… తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. బీజేపీ తన దత్తపుత్రిక షర్మిలతో పాదయాత్ర చేయిస్తూ కేసీఆర్ ను అప్రతిష్టపాలు చేయిస్తోందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లడమే కాకుండా… ఐఏఎస్ అధికారులను కూడా జైలుకు పంపిన చరిత్ర షర్మిల కుటుంబానిదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులను జైల్లో పెట్టేలా చేసింది దత్తపుత్రిక కుటుంబం కాదా? అని ప్రశ్నించారు.
తెలంగాణపై ఏపీ వాదుల కన్ను పడిందని… ఏపీలో ముఖం చెల్లక తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని గుత్తా విమర్శించారు. తెలంగాణపై దండులా విరుచుకుపడుతున్నారని అన్నారు. మళ్లీ దోచుకుందామని తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ప్రధాని మోదీ కన్ను ఇప్పుడు తెలంగాణపై పడిందని అన్నారు.