భార్య పేరుపై రూ. 1.90 కోట్ల బీమా.. కారుతో తొక్కి చంపించిన భర్త!

Spread the love
  • రాజస్థాన్‌లో అక్టోబరు 5న ఘటన
  • సహజ మరణం కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని హత్యకు కుట్ర
  • ఛేదించిన పోలీసులు
Man kills his wife in order to collect insurance money of nearly Rs 2 Cr
భార్య పేరున ఉన్న రూ. 1.90 కోట్లను కొట్టేయాలని భావించిన భర్త.. ఆమెను దారుణంగా హత్య చేయించాడు. రాజస్థాన్‌లో అక్టోబరు 5న జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భార్యను హత్య చేయించేందుకు ఓ రౌడీషీటర్‌తో నిందితుడు ఒప్పందం కుదర్చుకున్నాడు. అతడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తున్న బాధితురాలిని కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. భర్త మహేశ్ చంద్ ప్రోద్బలంతో అక్టోబరు 5న అతని భార్య షాలు, ఆమె కజిన్ కలిసి ద్విచక్ర వాహనంపై సమీపంలోని ఆలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో సాయంత్రం 4.45 గంటల సమయంలో ఓ ఎస్‌యూవీ వారిని ఢీకొట్టింది.

షాలు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన ఆమె కజిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు తెలిపారు. చూడ్డానికి ఇది రోడ్డు ప్రమాదంలా కనిపించినా ఆమె కుటుంబ సభ్యులు మాత్రం అనుమానించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ సొమ్ము కోసం భర్తే ఈ కుట్రకు ప్లాన్ చేసినట్టు తేలింది.

భార్యది సహజ మరణం అయితే కోటి రూపాయలు మాత్రమే వస్తాయని, అదే ప్రమాదంలో మరణిస్తే రూ. 1.90 కోట్లు వస్తాయన్న దుర్బుద్ధితోనే భర్త ఈ కిరాతకానికి పాల్పడినట్టు డీసీపీ వందితా రాణా తెలిపారు. భార్యను హత్య చేసేందుకు హిస్టరీ షీటర్ అయిన ముకేశ్ సింగ్ రాథోడ్‌తో రూ. 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ. 5.5 లక్షలు చెల్లించినట్టు పేర్కొన్నారు.

షాలును చంద్ 2015లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. రెండేళ్ల తర్వాత వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో షాలు తన పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. 2019లో భర్తపై గృహహింస కేసు కూడా పెట్టింది. ఇటీవల షాలు పేరుపై ఇన్సూరెన్స్ చేయించిన చందు.. తానో కోరిక కోరుకున్నానని, అది నెరవేరాలంటే 11 రోజులపాటు ప్రతి రోజూ బైక్‌పై హనుమంతుడి గుడికి వెళ్లాలని భార్యకు చెప్పాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కూడా హెచ్చరించాడు. తన కోరిక నెరవేరిన వెంటనే ఇంటికి తీసుకొస్తానని భార్యకు చెప్పాడు. భర్త మాటలు నమ్మిన ఆమె ప్రతి రోజూ బైక్‌పై ఆంజనేయుడి గుడికి వెళ్లి రావడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలోనే ఆమె అక్టోబరు 5న తన కజిన్ రాజుతో కలిసి బైక్‌పై ఆలయానికి వెళ్తుండగా అప్పటికే మరో ముగ్గురితో కలిసి సిద్ధంగా ఉన్న రాథోడ్ ఎస్‌యూవీతో ఆమెను చేజ్ చేసి ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో చంద్ బైక్‌పై ఎస్‌యూవీని అనుసరించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రాథోడ్‌తో ఎస్‌యూవీ యజమాని, సోనులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com