
- ఇప్పటం గ్రామస్తులకు పవన్ ఆర్థికసాయం
- నేడు చెక్కుల పంపిణీ
- నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలికి పవన్ పాదాభివందనం

పవన్ కల్యాణ్ మీ ఊర్లో సభ నిర్వహిస్తున్నారు కదా… మీ స్పందన ఏంటని నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలిని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. అందుకామె బదులిస్తూ, ఎంతో సంతోషంగా ఉందని బదులిచ్చారు. పవన్ అంటే తనకు చాలా ఇష్టమని, పవన్ తన నాలుగో కొడుకు అని అన్నారు. తనకు ముగ్గురు కొడుకులు అని, ఇప్పటికే ఇద్దరు చనిపోయారని, అయితే పవన్ రాకతో ఇప్పుడు తనకు ఇద్దరు కొడుకులు ఉన్నట్టు భావిస్తానని నాగేశ్వరమ్మ బదులిచ్చారు.
ఈ విషయం పవన్ కల్యాణ్ దృష్టికి వెళ్లింది. ఇవాళ ఇప్పటం గ్రామస్తులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పవన్ ప్రత్యేకంగా నాగేశ్వరమ్మను వేదికపైకి పిలిచారు. మీరేనా అమ్మా నన్ను మీ కొడుకు అని పేర్కొంది అని అడిగారు. ఆమెకు పాదాభివందనం చేసి ఆప్యాయంగా అక్కునజేర్చుకున్నారు.
“ఆ తల్లి నన్ను బిడ్డ అని భావించింది… ఒట్టేసి చెబుతున్నా… మీరు నాకు ఓట్లేసినా వేయకపోయినా మీకు నేను అండగా నిలబడతాను” అని పవన్ భావోద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు.