
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత ఢిల్లీలో ప్రీ బడ్జెట్ సమావేశం
- హాజరైన అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులు, కార్యదర్శులు
- వరుసగా రెండో పర్యాయం దూరంగా ఉన్న హరీష్ రావు

కేంద్రంలోని అధికార బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారి టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అడుగు వేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ద్వారా జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధం అయ్యారు. అదే సమయంలో సందర్భం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిగా టీఆర్ ఎస్ కూడా బీజేపీపై నేరుగా విమర్శల దాడికి దిగింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బడ్జెట్ ప్రతిపాదనలపై ఢిల్లీలో శుక్రవారం జరుగుతున్న సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు హాజరు కాలేదు.
2023- 24 పద్దు పై కసరత్తులో భాగంగా.. బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాత్రం బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఇలా ప్రీ బడ్జెట్ సమావేశాలకు హరీష్ రావు గైర్హాజరవడం ఇది రెండో పర్యాయం. రాష్ట్ర తరఫున ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది ఇలాంటి తరుణంతో హరీష్ రావు బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.