
- కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఎన్ హెచ్ఏఐ
- 63వ జాతీయ రహదారిపై మంచిర్యాల– చంద్రాపూర్ మార్గంలో ఏర్పాటు
- రూ. 30 కోట్ల ఖర్చుతో ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం

ఈ ప్రాంతంలో ఎక్కువగా పులులు సంచరిస్తుంటాయి. కాగజ్నగర్ అటవీ ప్రాంతంలోని మంచిర్యాల-చంద్రాపూర్ మార్గం పర్యావరణ సున్నిత ప్రాంతం. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వలస వచ్చే సమయంలో పులులు సాధారణంగా ఆ మార్గం గుండా వెళతాయి. రహదారిని దాటేప్పుడు అవి వాహనాలకు అడ్డురాకుండా ఈ పర్యావరణ బ్రిడ్జ్ ఉపయోగపడనుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) సుమారు ఒక కి.మీ పొడవుతో ఓవర్పాస్ వంతెనను నిర్మిస్తోంది. రూ.30 కోట్లతో నిర్మాణం జరుగుతోందని, ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలంగాణ అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పనుల వేగాన్ని బట్టి, దాదాపు ఆరు నెలల్లో నిర్మాణం సిద్ధం అవుతుందని చెప్పారు. ఎన్ హెచ్ఏఐ సివిల్ పనులను చేపడుతుండగా, అటవీ శాఖ నిర్మాణ రూపకల్పన, స్థాన గుర్తింపు, పర్యావరణ అంశాలు, పనుల అమలులో సమన్వయం చేస్తోంది. వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఈ వంతెన నిర్మిస్తున్నారు. పనుల అమలులో అన్ని పర్యావరణ అనుకూల చర్యలను అనుసరిస్తున్నట్లు అధికారి తెలిపారు.