గవర్నర్ నుంచి ఎలాంటి లేఖ అందలేదన్న మంత్రి సబిత .. సమాచారం ఇచ్చామని స్పష్టంచేసిన రాజ్ భవన్ వర్గాలు

Spread the love

తెలంగాణలో ప్రభుత్వానికి..రాజభవన్ కు మధ్య వివాదం అంతకంతకు ముదురుతోంది. ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ కావాలనే ఆమోదం తెలుపకుండా పెండింగ్ లో పెడుతున్నారంటూ ఆరోపిస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు గురించి ప్రభుత్వానికి లేఖ రాశామని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. దీనిపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ.. రాజ్ భవన్ నుంచి తనకు ఎలాంటి లేఖ అందలేదని స్పష్టం చేశారు.

యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు గురించి గవర్నర్ లేఖ రాశారని మీడియా, సోషల్ మీడియాలో మాత్రమే చూశానని..కానీ నాకు గవర్నర్ కార్యాలయం నుంచి ఎటువంటి లేఖా రాలేదని తెలిపారు.నిజాం కాలేజీ హాస్టల్ సమస్యపై బుధవారం (నవంబర్ 9,2022)ఉన్నత విద్యాశాఖాధికారులతో సమావేశం కానున్నట్లు సబిత ప్రకటించారు. అధికారులతో చర్చించిన అనంతరం నిజాం కాలేజీ వ్యవహారంపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి రాజభవన్ వర్గాలు. గవర్నర్ కార్యాలయం నుంచి ఎటువంటి లేకా రాలేదని చెప్పటం సరికాదని..నవంబర్ 7(2022)న మెసెంజర్ ద్వారా సమాచారం అందించామని స్పష్టంచేసింది గవర్నర్ కార్యాలయం.

కాగా..యూనివర్సిటీ పోస్టుల భర్తీ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై సోమవారం అంసతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్లుగా యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని..తెలంగాణ యూనివర్సిటీస్‌‌ కామన్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు బిల్లుపై రాజ్‌‌భవన్‌‌కు వచ్చి చర్చించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. సోమవారం ఈ మేరకు సబితా ఇంద్రారెడ్డికి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లెటర్ రాశారు. మరోవైపు రాష్ట్ర సర్కారు కొత్తగా తెచ్చిన కామన్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు బిల్లుపై తమిళిసై యూజీసీ అభిప్రాయం కోరారు. ఈ బిల్లు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియజేయాలని సూచించారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com