ఆప్ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇసుదాన్ గాధ్వి, ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరతిహ్యా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం అభ్యర్థి పేరును ప్రకటించేందుకు కేజ్రీవాల్ శుక్రవారం అహ్మదాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. రాష్ట్రంలో ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించడంతో ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేశారు. ఇప్పటికే గుజరాత్లో విస్తృతంగా పర్యటిస్తున్న కేజ్రీవాల్.. బీజేపీ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా వచ్చేనెలలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును శుక్రవారం కేజ్రీవాల్ ప్రకటిస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని అధికశాతం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన పార్టీ.. ప్రజాభిష్టం మేరకు సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు.
ఆప్ నుంచి అత్యున్నత పదవికి రేసులో ఉన్నవారిలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇసుదాన్ గాధ్వి, ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరతిహ్యా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం అభ్యర్థి పేరును ప్రకటించేందుకు కేజ్రీవాల్ శుక్రవారం అహ్మదాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దానిపై తమ అభిప్రాయాలను తెలియజేయడానికి ఎస్ఎంఎస్, వాట్సాప్, వాయిస్ మెయిల్, ఈ-మెయిల్ ద్వారా పార్టీని సంప్రదించాలని గత వారం కేజ్రీవాల్ ప్రజలను కోరారు. నవంబర్ 3 సాయంత్రం వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని, వారి అభిప్రాయాల ఆధారంగా మరుసటి రోజు పార్టీ ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తామని కేజ్రీవాల్ గత శనివారం చెప్పారు.
ఇదిలాఉంటే గుజరాత్ ఎన్నికలకోసం 10 మంది అభ్యర్థులతో కూడిన తొమ్మిదో జాబితాను ఆప్ గురువారం ప్రకటించింది. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 118కి చేరుకుంది. గుజరాత్ రాష్ట్రంలో 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే నెలలో రెండు దశల్లో (డిసెంబర్ 1, 5 తేదీల్లో) ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.