2024 ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలపై త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తామని ప్రకటించారు. తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న తాడేపల్లిలో జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరుకానున్నారు.
కాగా మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తుండగా.. ఏపీలో మాత్రం వైసీపీకి తన వ్యూహాలను అందిస్తున్నారు. ఈ తరుణంలో అధికార వైసీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే పొత్తు అంశాన్ని మంత్రులు ఖండిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో తమకు పొత్తేంటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు సోమవారం సాయంత్రం 6:30 గంటలకు అమరావతిలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఏపీ హైకోర్టు సీజే పీకే మిశ్రాను తొలిసారిగా సీఎం జగన్ కలవనున్నారు. జగన్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.