దుస్తులు విప్పి, దాడులు చేస్తున్నారంటూ.. తిరుమల కళ్యాణకట్టలో క్షురకుల మెరుపు ధర్నా

Spread the love

తిరుమల శ్రీవారి కళ్యాణకట్టలో క్షురకులు ధర్నా నిర్వహించారు. విజిలెన్స్ తనిఖీలకు నిరసనగా విధులు బహిష్కరించి కళ్యాణకట్టలో ఆందోళన చేపట్టారు. తమపై విజిలెన్స్ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. టీటీడీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో చేరము అని చెప్పినందుకే దాడులు చేస్తున్నారని అన్నారు.

గత 12ఏళ్లుగా శ్రీవారికి సేవ చేస్తున్నామని, ఇప్పుడు ఉన్నట్టుండి ఈ దాడులు ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ దుస్తులు విప్పి తనిఖీలు చేయాల్సిన అవసరం ఏంటని మండిపడుతున్నారు. టీటీడీ ఔట్ సోర్సింగ్ లో చేరేందుకు ఇష్టం లేక కోర్టుకి వెళ్లామని చెప్పారు. ఇందుకే తమపై దాడులు చేస్తున్నారని, ఇలా దాడులు కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు.

 

టీటీడీ విజిలెన్స్ అధికారులు వేధిస్తున్నారని కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న పీసీ రేటు క్షురకులు ఆరోపించారు. టీటీడీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో తాము విలీనం అవ్వకపోవడంతోనే ఇలా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. గురువారం ఉదయం నుంచి తమని విధులు చేసుకోనివ్వకుండా టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుపడుతున్నారని వారు ఆరోపించారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com