ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ సరిహద్దులోని సాంబా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఢిల్లీ-అమృత్ సర్-కాత్రా ఎక్స్ ప్రెస్ వేకు ఆయన శంకుస్థాపన చేశారు. పల్లీ గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించారు. 8.45 కిలోమీటర్ల పొడవున రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్–ఖాజీగంద్ రోడ్డు సొరంగాన్ని ప్రారంభించారు. చినాబ్ నదిపై 850 మెగావాట్ల రాటిల్ జలవిద్యుత్ కేంద్రం, 540 మెగావాట్ల క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. పంచాయతీరాజ్ దినోత్సవం నాడు ఇక్కడ పర్యటించడం ఆనందంగా ఉందని పేర్కొన్న ఆయన.. పల్లీ గ్రామం దేశంలోనే తొలి కర్బన ఉద్గారాలు లేని పంచాయతీగా నిలిచిందని ప్రశంసించారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ లేకపోవడం వల్ల జమ్మూ ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, అయితే ప్రజల సాధికారత కోసం తాము అన్ని చట్టాలను అమలు చేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ యువతకు తప్పకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూకాశ్మీర్లో ఏళ్ల తరబడి రిజర్వేషన్ పొందని వారు ఇప్పుడు రిజర్వేషన్ ప్రయోజనం కూడా పొందుతున్నారని మోదీ స్పష్టం చేశారు. దేశ ప్రజలకు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ సేవలు గ్రామ స్థాయి నుంచి దేశ అభివృద్ధికి బాటలు పరుస్తాయని ఆయన అన్నారు.
అంతకుముందు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ… దేశంలో డిజిటల్ లావాదేవీల అంశం గురించి మాట్లాడారు. దేశంలో ఇప్పుడు రోజుకు రూ.20 వేల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు మనకు అన్ని సౌకర్యాలను మెరుగుపర్చడమే కాకుండా నిజాయితీతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. చిన్న ఆన్లైన్ చెల్లింపులు పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతున్నాయని చెప్పారు. వీటి వల్ల అనేక కొత్త ఫిన్టెక్ స్టార్టప్లు రాబోతున్నాయని మోదీ పేర్కొన్నారు. గత మార్చి నెలలో UPI లావాదేవీలు రూ. 10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రధాని మోదీ తెలిపారు.