ఒక్కొక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా?: సీఎం జగన్
- పవన్ వ్యాఖ్యలకు సీఎం జగన్ కౌంటర్
- మూడు రాజధానులతో అభివృద్ధి జరగదా..
- చెప్పులు చూపిస్తూ దారుణంగా తిడుతున్నారు
- ఇలాంటి వాళ్లా మన నాయకులా అని ఆవేదన
రాష్ట్రంలోని ఏ ప్రాంతానికీ, ఎవరికీ అన్యాయం జరగకుండా అభివృద్ధి చేసుకుందామని మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచన చేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. అయితే, కొంతమంది నేతలు మూడు రాజధానులతో కాదు మూడు పెళ్లిళ్లతో అభివృద్ధి జరుగుతుందని కొంతమంది చెబుతున్నారని పరోక్షంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఏకంగా టీవీల ముందుకొచ్చి మరీ మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెప్తున్నారు, చెప్పులు చూపిస్తూ దారుణమైన భాషలో తిడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్లా మన నాయకులని విరక్తి కలుగుతున్నట్లు జగన్ చెప్పారు. వీధి రౌడీలు కూడా ఇలాంటి భాష మాట్లాడరని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కొక్కరూ మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటే మన అక్కాచెల్లెళ్లు, మన ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. పెళ్లి చేసుకుని ఐదారు సంవత్సరాలు కాపురం చేసి, ఎంతోకొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల మంగళగిరిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై స్పందించిన విషయం తెలిసిందే. తనను పదేపదే మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.. మీరు కూడా చేసుకోండని పవన్ సూచించారు. మొదటి భార్యకు
ఐదు కోట్లు ఇచ్చి విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకొమ్మని అన్నారు. విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నాను తప్ప కొంతమంది నేతల లాగా ఒక్క పెళ్లి చేసుకుని, ముప్పై మంది స్టెఫినీలతో తిరగలేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.