ఈడీ అదుపులో … శివసేన సంజయ్ రౌత్
ముంబై : శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని, ఈడీ కార్యాలయానికి తరలించారు. సంజయ్ను ఈడీ అదుపులోకి తీసుకుందన్న వార్త తెలుసుకుని, మద్దతుదారులు, అభిమానులు.. ముంబైలోని ఆయన నివాసానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈడీకి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రౌత్ను అదుపులోకి తీసుకోవడంతో.. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అధికారులు సంజయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా, విచారణకు హాజరవ్వాలని ఈడీ ఆయనకు రెండుసార్లు నోటీసులు జారీచేసింది. అయితే పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాను విచారణకు రాలేనని, ఆగస్టు 7 తర్వాత హాజరవుతానని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులే ఎంపీ ఇంటికి రావడం గమనార్హం.