
తిరుమల: ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ చిత్రం వచ్చే నెల 5న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో కళ్యాణ్ రామ్.. చిత్ర బృందంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి ఆలయ పండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్చనం అందిగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయం వెలుపల కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 5న తమ బింబిసార చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని చెప్పారు. సినిమా విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్ధిస్తూ, స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామన్నారు. కథ వస్తే జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటిస్తానని చెప్పారు.