భారీ వర్షాలతో ఒక్కసారిగా పెరిగిన డెంగీ కేసులు..
హైదరాబాద్ నగరంలో కొద్దిరోజులుగా డెంగీ జ్వరాలు పెరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖలు నిర్లక్ష్యం వీడట్లేదు. జిల్లా మలేరియా అధికారుల లెక్కలకు, జీహెచ్ఎంసీలోని ఎంటమాలజీ విభాగం గణాంకాలకు పొంతన ఉండట్లేదు. ఫలితంగా.. ఒక ఇంట్లో.. ఒకరితో మొదలైన డెంగీ జ్వరం.. ఇంట్లోని అందరినీ తాకుతోంది. గతేడాది జులై నెలాఖరు వరకు 130 డెంగీ కేసులు నమోదవగా, ఈ ఏడాది ఇప్పటికే 596 కేసులు నమోదయ్యాయి.
గతేడాదిలో మొత్తం 1559 కేసులు నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య మూడు రెట్లకుపైగా ఉండొచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఫాగింగ్ కోసం 18 యూనిట్లు పని చేస్తున్నాయి. ఒక్కో యూనిట్లో 19 మంది ఉంటారు. అందులో ఒకరు సూపర్వైజరు. దోమల మందును పిచికారి చేసే బృందాలు 107 ఉన్నాయి. ఒక్కో బృందంలో 19 మంది ఉంటారు. మొత్తంగా దోమల నివారణ విభాగంలో 2,500ల మంది సిబ్బంది ఉంటే.. అందులో సగం మంది కూడా రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఫాగింగ్ కోసం ఇచ్చే డీజిల్, పెట్రోలును కొందరు సిబ్బంది అమ్ముతుండగా, ఇంటింటికి తిరిగి మందు చల్లాల్సిన సిబ్బందేమో.. ఇంటి గోడపై సంతకాలు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. పైగా.. ఉన్న అరకొర సిబ్బందిని కేంద్ర కార్యాలయం ఇతర అవసరాలకు మళ్లించింది. రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల పరిశీలనకు దోమల విభాగం కార్మికులను ఉపయోగించుకుంటోంది.