క్యాసినో నిర్వహణ పేరుతో మనీ లాండరింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్కి సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా చికోటి ప్రవీణ్ ఫాంహౌస్లో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. అక్కడ పలు రకాల జంతువులను గుర్తించారు. అందులో కొండ చిలువలు, వివిధ రకాల విష సర్పాలు, విదేశీ ఉడుములు, బల్లులు, ముంగీసలు, పక్షులు, మాట్లాడే చిలుకలు ఉన్నాయి. మొత్తంగా ప్రవీణ్ ఫాంహౌస్ మినీ జూపార్క్ను తలపించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లేదని చెప్పడం గమనార్హం.విదేశాల నుంచి పలు రకాల పక్షులు, జంతువులను తీసుకొచ్చి ప్రవీణ్ తన ఫాంహౌస్లో పెంచుకుంటున్నాడని అధికారులు వెల్లడించారు. వాటితో వ్యాపారం చేసినా, వాటికి ఏమైనా హాని తలపెట్టినా కేసులు పెడుతామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని సాయిరెడ్డి గూడలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో చికోటి ప్రవీణ్ ఫాంహౌస్ ఉంది. క్యాసినో వ్యవహారంలో ఇటీవల ఈడీ తనిఖీల నేపథ్యంలో చికోటి ప్రవీణ్ ఫోటోలు కొన్ని బయటకొచ్చాయి. అందులో ప్రవీణ్ ఉడుములు, పాములతో దిగిన ఫోటోలు ఉన్నాయి. దీంతో చికోటి ప్రవీణ్ ఫాంహౌస్పై అటవీ అధికారుల దృష్టి పడింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అక్కడ తనిఖీలు నిర్వహించారు.ఈ వ్యవహారంపై ఫాంహౌస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న చికోటి ప్రవీణ్ మామ గట్టు మాధవరావు మాట్లాడుతూ.. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ జరగట్లేదని తెలిపారు. ప్రవీణ్ స్వతహాగా జంతు ప్రేమికుడని.. అన్ని అనుమతులు తీసుకునే ఫాంహౌస్లో వాటిని పెంచుకుంటున్నాడని తెలిపారు. ఫాంహౌస్లో ఎలాంటి పార్టీలు, అసాంఘీక కార్యకలాపాలకు తావు లేదన్నారు.