పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నీటిపై తేలియాడే అత్యాధునిక సోలార్ ప్లాంట్ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ జాతీకి అంకితం చేస్తారు. ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో రూ.430 కోట్లతో 450 ఎకరాల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఒక్కొక్కటి 2.5 మెగావాట్ల సామర్థ్యంతో 40 బ్లాకులుగా విభజించి నిర్మాణం చేశారు.ప్రతి బ్లాక్లో ఒక ఫ్లోటింగ్ ప్లాట్ఫారమ్లో 11వేల200 సోలార్ మాడ్యూల్ శ్రేణి ఉంటుంది. ఫ్లోటింగ్ ప్లాట్ఫారమ్లో ఒక ఇన్వర్టర్, ట్రాన్స్ ఫార్మర్తో పాటుగా ఒక HT బ్రేకర్ ఏర్పాటు చేశారు. దీని వల్ల నీళ్లు తగ్గినా..,పెరిగినా..సోలార్ ప్లేట్స్కు ఎక్కడా ఇబ్బంది ఉండదు. విద్యుత్ ఉత్పత్తి నిరంతరంగా సాగుతుంది.రిజర్వాయిర్లపైనా, లేదా సౌలభ్యం ఉన్న నీటి వనరులపైనా ఇలాంటి ప్లాంట్ ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాజెక్టులకు ప్రత్యేక భూసేకరణ అవసరం ఉండకపోవడం ఓ మేజర్ అడ్వాంటేజ్. అలాగే..సదరు సోలార్ పలకలు కప్పి ఉండటం వల్ల జలవనరులు ఆవిరికాకుండా పూర్తిగా వినియోగం చేసుకోవచ్చని ఎన్టీపీసి టెక్నికల్ అధికారులు చెప్తున్నారు. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు భూసేకరణ ఇతరత్రా అదనపు ఖర్చులు లేకపోవడంతో శరవేగంగా నిర్మాణపు పని పూర్తి అయింది.