హైదరాబాద్ లో మళ్లీ కుండపోత.. లోతట్టు ప్రాంతాల్లో భయంభయం
హైదరాబాద్ ను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. గ్రేటర్ పరిధిలో మళ్లీ కుండపోతగా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ దంచికొట్టింది,. ఉక్కపోతగా జనాలు ఇబ్బంది ప్డడారు. అయితే 3 గంటల ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. కాసేపటికే వర్షం మొదలైంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మియాపూర్, మాదాపూర్, కూకట్ పల్లి, నిజాంపేట, ఖైరతాబాద్, చింతల్, గాజుల రామారం, లక్డీకాపూల్, అసెంబ్లీ, బషీర్బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్బజార్, అబిడ్స్, ఎల్బీనగర్, దిల్ షుక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నాంపల్లి, ముషీరాబాద్, చిక్కడపల్లి, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
వరద నీరు రోడ్లపైకి చేరింది. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. వరద నీటితో నగరంలోని ప్రధాన కూడళ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి మూసీనదిపై ఉన్న మూసారంబాగ్ వంతెన పూర్తిగా నీట మునిగింది. రెండు రోజుల పాటు వంతెనను అధికారులు మూసివేశారు. మళ్లీ భారీ వర్షం కురవడంతో మూసారాంబాగ్ వంతెనపై మళ్లీ నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై నిలిచిన నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.