
తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది.ఆపరేషన్ ఆకర్ష్తో పాటు పాదయాత్రలు, ప్రజాగోస-బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలతో ఎన్నికల వేడిని ఏడాదికి ముందుగానే పుట్టిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర బీజేపీఅధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంకల్పయాత్ర మూడో విడత ఆగస్టు 2నుండి.. యాదాద్రి నుండి హన్మకొండ వరకు సాగనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు. ఐదు జిల్లాల్లోని 12 నియోజకవర్గాలను కవర్ చేస్తూ .. 328 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. మొత్తం 24 రోజులపాటు కొనసాగనుంది.లక్ష్మీ నరసింహుడు కొలువుదీరిన యాదాద్రిలో స్వామివారి ఆశీర్వాదం తీసుకుని బండి సంజయ్ ఈ యాత్రను ప్రారంభించనున్నారు. వరంగల్లోని భద్రకాళి ఆలయం వరకు మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది.
గతంలో చేసిన రెండు యాత్రలకు విభిన్నంగా చారిత్రక , తెలంగాణ సాయుధ , ఉద్యమ పోరాటాల నేపథ్య ప్రాంతాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. జనం గోస వినడం .. ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు తెలంగాణలో రాబోయేది భాజపా సర్కారేననే సంకేతాలు పంపడమే యాత్ర లక్ష్యంగా బండి ముందుకు వెళ్తున్నారు. బండి సంజయ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లలో శ్రేణులు నిమగ్నమయ్యాయి. యాదాద్రి భువనగిరి , నల్గొండ , జనగాం , వరంగల్ , హన్మకొండ జిల్లాల మీదుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వెళ్లనున్నారు. ముఖ్యంగా ఈసారి బండి సంజయ్ పాదయాత్రలో మునుగోడులో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే బీజేపీలో చేరికలే లక్ష్యంగా పాదయాత్రను ప్లాన్ చేస్తున్నారు.
బండి సంజయ్ పాదయాత్రలోనే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో పాటు పార్టీ శ్రేణుల్ని భారీగా బీజేపీలోకి చేర్చుకొని..అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది. కాని రాజగోపాల్రెడ్డి మాత్రం అగస్ట్ 7వ తేది వరకు తనకు సమయం ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ని కోరడంతో మునుగోడులో బహిరంగ సభ ఉంటుందా ? లేదా ? అనే సందిగ్ధం కొనసాగుతోంది.