ఇండియన్ ఎయిర్ఫోర్స్కి చెందిన శిక్షణ విమానం MiG-21 విమానం ఒకటి రాజస్తాన్లోని బర్మర్ జిల్లాలో కూలిపోయింది.ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. బర్మర్ జిల్లా కలెక్టర్ లోక్ బందు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భీందా గ్రామ సమీపంలో విమానం కూలిపోయినట్లు తెలిపారు.
ఫైటర్ జెట్ MiG-21 విమానం రాత్రి 9.10 గంటలకు కూలిపోయినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ వెల్లడించింది. పైలట్ల మృతి పట్ల ఎయిర్ఫోర్స్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ఎయిర్ఫోర్స్ అండగా ఉంటుందని తెలిపింది. ప్రమాద ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.ఫైటర్ జెట్ కుప్పకూలిన తర్వాత ఒక్కసారిగా భారీగా మంటలు అంటుకున్నాయి. ప్రమాద కారణాలేంటనేది ఇంకా వెల్లడికాలేదు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రమాద ఘటనపై ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పైలట్ల మృతి తీవ్ర విచారకరమని, దేశానికి వారి సేవలు మరిచిపోలేనివని అన్నారు.
కాగా, గడిచిన ఐదేళ్లలో త్రివిధ దళాలకు చెందిన 42 మంది సిబ్బంది ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్ ప్రమాదాల్లో మృతిచెందారు. మొత్తం 45 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇండియన్ ఎయిర్ఫోర్స్కి సంబంధించి 29 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మార్చిలో రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ రాజ్యసభలో ఈ వివరాలు వెల్లడించారు.