కేదార్నాథ్లో భారీగా మంచు వర్షం.. చిక్కుకుపోయిన యాత్రికులు.. ఊపరాడక ఇబ్బందులు
కేదార్నాథ్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో చార్ధామ్ యాత్రకు వెళ్లిన భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఎడతెగని హిమపాతంతో భక్తులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
కాగా, చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ముందుగా యమునోత్రి, గంగోత్రి యాత్ర ప్రారంభమైంది. సముద్ర మట్టానికి 12 వేల అడుగుల్లో కేదార్నాథ్ యాత్ర కొనసాగుతుంది. కేదార్నాథ్లో ప్రతికూల వాతావరణం ఉన్నా.. యాత్రికులు ఒక్కసారైనా కేదార్నాథుడిని దర్శించుకోవాలని వెళ్లారు. కానీ.. మంచు వర్షంతో ఆ ప్రాంతమంతా కూరుకుపోయింది. తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. దాంతో కొందరు మంచులోనే కూరుకుపోయారు. మరికొందరు అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు చర్యలు చేపట్టి.. గుర్రాలపై అక్కడి నుంచి తరలిస్తున్నారు.
కేదార్నాథ్లో ఎడతెగని హిమపాతం కారణంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు స్థానిక అధికారులు. మరోవైపు రిషికేష్లోని ప్రయాణికుల రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. టూరిస్టుల్లో గుండె జబ్బులు ఉన్నవారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిరంతర హిమపాతం మధ్య 12వేల అడుగుల ఎత్తులో ఆక్సిజన్ పీడనం తగ్గుతుందని తెలిపారు.
కాగా, మరో రెండు మూడు రోజులపాటు మంచు వర్షం కొనసాగుతుందని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.