సోనియా గాంధీ ఒక విషకన్య… తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే

Spread the love
  • మోదీని విషసర్పం అంటారా అంటూ బసనగౌడ ఆగ్రహం
  • వీసా నిరాకరించిన దేశాలు ఇప్పుడు మోదీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయన్న ఎమ్మెల్యే
  • సోనియా విషపూరితమైన వ్యక్తి అని వ్యాఖ్యలు
  • ఆమె చైనా, పాకిస్తాన్ దేశాల ఏజెంట్ అంటూ ధ్వజం
  • బసనగౌడను బీజేపీ సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను విషకన్య అని అభివర్ణించారు. పాకిస్తాన్, చైనా దేశాల ఏజెంట్ అని ధ్వజమెత్తారు.

ప్రధాని మోదీ ఓ విషసర్పం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బసనగౌడ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

గతంలో మోదీకి వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిందని, ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆయనను కొనియాడుతున్నాయని, ప్రపంచ నేతలు ఆయనతో వేదికను పంచుకుంటున్నారని అన్నారు. మోదీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారని, అలాంటి ప్రధానిపై కాంగ్రెస్ ఇష్టారీతిన మాట్లాడుతోందని, ఆ పార్టీ నేతలు ఆయనను విషసర్పం అంటున్నారన్నారని మండిపడ్డారు. వాస్తవానికి ఈ దేశాన్ని సోనియా నాశనం చేశారని, ఆమె విషపూరితమైన వ్యక్తి అని విమర్శించారు.

బసనగౌడ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రణ్ దీప్ సుర్జేవాలా తీవ్రంగా స్పందించారు. కర్ణాటక బీజేపీ నేతలు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్నారని విమర్శించారు. రాజకీయంగా కూడా వారు పరపతిని కోల్పోతున్నారన్నారు. బసనగౌడను బీజేపీ సస్పెండ్ చేయాలని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com