
- లింగంగుంట్లలో ఫ్యామిలీ డాక్టర్ స్కీంను ప్రారంభించిన సీఎం
- ప్రతీ పేదవాడికీ భరోసా కల్పించే విధానమని వెల్లడి
- ఇంటి ముంగిటకే వైద్యసేవలు తీసుకొచ్చే కార్యక్రమం

గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్యం కోసం ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం ఇకపై ఉండదని వైఎస్ జగన్ చెప్పారు. డాక్టరే మీ గ్రామానికి వచ్చి వైద్యం చేస్తాడని వివరించారు. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వారికి ఇంట్లోనే వైద్యం జరుగుతుందని పేర్కొన్నారు. మందులు కూడా గ్రామానికే వస్తాయని తెలిపారు. ఇంటింటికీ నడిచి వచ్చే పింఛన్ తరహాలోనే వైద్య సేవలు కూడా మీ గ్రామానికి, మీ సమీపానికి.. అవసరమైన సందర్భాలలో మీ ఇంటికే తరలిరావడానికి ఉద్దేశించి తీసుకొచ్చిన ప్రోగ్రాం ఫ్యామిలీ డాక్టర్ అని జగన్ చెప్పారు.
నిరుపేదలు, పేద సామాజిక వర్గాల వారు ఆసుపత్రుల చుట్టూ, ల్యాబ్ ల చుట్టూ, మందుల షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫ్యామిలీ డాక్టర్ పోగ్రాం మీ గ్రామం వద్దకే వీటన్నిటినీ తీసుకొస్తుందని చెప్పారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.