హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. రాజకీయాలకు అతీతకంగా అందరినీ బోనాల జాతరకు ఆహ్వానించామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.సీఎం కేసీఆర్ నేడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. గోదవారి పరివాహక ప్రాంతాల్లో వరద ముంపును క్షేత్రస్థాయిలో పరిశీస్తున్న ముఖ్యమంతి.. పర్యటన అనంతరం ఏటూరునాగారం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు.ఇక హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నేడు సికింద్రాబాద్ బోనాలకు హాజరవుతారు. కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు.