- అమెరికా కాంగ్రెస్కు ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక
- భారత్-చైనా చర్చలు జరుగుతున్నా పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదని వెల్లడి
- మోదీ నాయకత్వంలో భారత్ పాక్పై సైనిక శక్తిని ప్రయోగించే అవకాశం
సరిహద్దు వివాదంపై ఇండియా, చైనా మద్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా సద్దుమణగలేదని అమెరికా ఇంటెలిజెన్స్ శాఖ పేర్కొంది. 2020 నాటి గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కొంత మేర ఉద్రిక్త వాతావరణం నెలకొందని తమ నివేదికలో తెలిపింది. సరిహద్దు వద్ద ఇరు దేశాల సైన్యాల మోహరింపుతో ఘర్షణకు అవకాశాలు పెరిగాయని, ఇది అమెరికా ప్రయోజనాలకు ప్రమాదమని అభిప్రాయపడింది. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాలని కూడా సూచించింది.
ఇక భారత్-పాక్ సంబంధాలపై అమెరికా వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరు దేశాల మధ్య పరిస్థితి దిగజారే అవకాశాలు ఎక్కువని అభిప్రాయపడ్డాయి. ఇరు దేశాలు సరిహద్దు వెంబడి శాంతి స్థాపనకు మొగ్గు చూపుతున్నప్పటికీ.. పాక్ ఉగ్రవాదులకు మద్దతిస్తున్న కారణంగా మోదీ నేతృత్వంలోని భారత్ దాయాదిపై సైనిక శక్తిని వినియోగించే అవకాశాలు పెరిగాయని పేర్కొంది.