సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు
కరీంనగర్ దీక్షలో ధ్వజమెత్తిన బండి సంజయ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) తన పుట్టినరోజు నాడు మౌన దీక్ష చేశారు. పోడు భూములు, గిరిజన సమస్యపై కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు. కుర్చీ వేసుకుని గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీని గుర్తు చేస్తూ బీజేపీ నేతలు కుర్చీ వేశారు .ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్తో గ్రామాల్లో చిచ్చు పెట్టారని ఆరోపించారు. ధరణి పోర్టల్తో కేసీఆర్, ఆయన కుటుంబానికి తప్ప ప్రజలెవరికీ ఉపయోగం లేదన్నారు. వేల కోట్ల రూపాయలు విలువచేసే భూములను కేసీఆర్ తన పేరిట రిజిస్టర్ చేయించుకునేందుకు ధరణి పోర్టల్ తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ధరణిని సరిదిద్దాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. ఈ పోర్టల్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీఆర్ఎస్ నేతలే చెబతున్నా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.ఆసిఫాబాద్, ఖమ్మం, నల్గొండ, మంచిర్యాల జిల్లాలో గిరిజనులపై దాడులను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గిరిజనులపై దాడులు చేస్తున్నరాని బీజేపీ ఆరోపిస్తోంది. అలాగే, ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను సరిచేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ రెండు డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని బండి సంజయ్ మౌన దీక్షకు పూనుకున్నారు.