కోహ్లీకి చాన్స్ దక్కొచ్చు.. రోహిత్ కు కష్టమే.. వచ్చే టీ20 వరల్డ్ కప్ పై వసీం జాఫర్ వ్యాఖ్యలు
- పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీతో యూట్యూబ్ లో ముచ్చటించిన జాఫర్
- రోహిత్ ఇప్పటికే తన చివరి టీ20 వరల్డ్ కప్ ఆడేశాడని వ్యాఖ్య
- వన్డే వరల్డ్ కప్ లో ఒత్తిడికి గురికాకుండా.. వారిద్దరికీ సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చి ఉండొచ్చని వెల్లడి
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీతో యూట్యూబ్ లో మాట్లాడిన జాఫర్.. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘‘టీ20ల్లో యువకులే ఉంటారు. అందుకే వచ్చే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ భాగమవుతాడని నేను అనుకోవడం లేదు. కోహ్లీ ఆడితే ఆడొచ్చు. రోహిత్ మాత్రం కష్టమే’’ అని తెలిపాడు.
‘‘శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ ల నుంచి కోహ్లీ, రోహిత్ కు రెస్ట్ ఇచ్చారు. త్వరలో ఆస్ట్రేలియాతో సిరీస్ ఉంది. తర్వాత ఐపీఎల్, వన్డే వరల్డ్ కప్ వస్తున్నాయి. ఇవి అయిపోయాక ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ వస్తుంది. విరామం లేకుండా షెడ్యూల్ ఉంది. వీటన్నింటినీ బట్టి చూస్తే రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ లో ఆడకపోవచ్చు. ఇప్పటికే అతడికి 36 ఏళ్లు అనుకుంటా’’ అని వివరించాడు. ఈ ఏడాది ఆఖర్లో వన్డే వరల్డ్ కప్ ఉందని, అప్పటిదాకా వారిపై ఒత్తిడి ఉండకుండా సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చి ఉండొచ్చని తెలిపాడు.