
- జీవో అమలుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ హైకోర్టు
- దీన్ని సుపీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
- ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై జోక్యం చేసుకోలేమన్న సర్వోన్నత న్యాయస్థానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్1పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో రహదారులపై రోడ్డు షోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. దీనిపై ప్రతిపక్షాలు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. జీవోను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్1పై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై విచారణ ముగిస్తున్నట్టు తెలిపింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనమే దీనిపై విచారణ చేపడుతుందని సర్వోన్నత న్యాయస్థనం స్పష్టం చేసింది. ఆ ధర్మాసనం ముందే అన్ని అంశాలను ప్రస్తావించాలని సూచించింది.