- మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే
- అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలపై 41ఎ కింద నోటీసులు జారీ
- గతేడాది చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నోటీసులు ఏంటన్న ఆయన న్యాయవాది
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై మరో కేసు నమోదైంది. గతేడాది అజ్మీర్ దర్గాపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో పోలీసుల నోటీసు అందుకున్నారు. అజ్మీర్ దర్గాపై చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ సయ్యద్ మహమూద్ అలీ అనే వ్యక్తి గత ఏడాది ఆగస్టు 24న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. ఆ తరువాత ఈ కేసును కంచన్ భాగ్ నుంచి మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.
తాజాగా, మంగళ్హాట్ పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్కు సీఆర్పీసీ 41ఎ కింద నోటీసులు ఇచ్చారు. అయితే, ఏడాది కింద చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని రాజా సింగ్ న్యాయవాది కరుణాసాగర్ ప్రశ్నించారు. ఇవి కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలే అని అన్నారు. చట్టానికి లోబడి నోటీసులకు స్పందిస్తామన్నారు. ఈ కేసును కోర్టులో ఎదుర్కొంటామన్నారు. న్యాయస్థానాలు, చట్టంపై తమకు గౌరవం ఉందని చెప్పారు.