బుమ్రాను చూసి బ్యాటింగ్​లో రెచ్చిపోయిన మరో భారత బౌలర్​.

Spread the love
    ఇంగ్లండ్‌తో టెస్టులో భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా తన బ్యాట్ పవర్ చూపెట్టి… ఒకే ఓవర్లో 29 పరుగులు రాబట్టి రికార్డు సృష్టించగా తాజాగా మరో పేసర్ బ్యాట్ తో రెచ్చిపోయాడు. యువ పేసర్ హర్షల్ పటేల్ మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగాడు. స్టార్ బ్యాటర్ మాదిరిగా ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఆపై, బౌలింగ్ లోనూ రాణించి రెండు వికెట్లు పడగొట్టాడు.
దాంతో, ఆదివారం రాత్రి నార్తంప్టన్‌షైర్ క్లబ్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలోని యువ భారత్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. డెర్బీషైర్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్… ఇంగ్లండ్ తో ఈ నెల 7నుంచి జరిగే మూడు టీ20ల సిరీస్ కు రెడీ అయింది.    
 నార్తంప్టన్‌షైర్ క్లబ్‌తో మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. టాపార్డర్‌ బ్యాటర్లు విఫలం కాగా.. కెప్టెన్‌ దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 34; 3 ఫోర్లు, సిక్స్‌)తో పాటు హర్షల్ మెరుపులతో భారత్ ఆ మాత్రం స్కోరు చేసింది. 
ఛేదనలో భారత బౌలర్లు విజృంభించడంతో నార్తంతాంప్టన్‌ 19.3 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ప్రత్యర్థి జట్టులో  సైఫ్‌ జైబ్‌ 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ తో పాటు అర్షదీప్‌ సింగ్‌, ఆవేశ్‌ ఖాన్‌,చహల్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. హర్షల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు. 
WP2Social Auto Publish Powered By : XYZScripts.com