నువ్వు ‘ఒరేయ్’ అంటే మేం ‘ఒసేయ్’ అనలేమా..?: బోండా ఉమా…
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం నాడు విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియామీట్ నిర్వహించిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదన్నారు. గ్యాంగ్రేప్ ఘటనపై తూతూ మంత్రంగా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.10 లక్షలిచ్చి చేతులు దులుపుకుందన్నారు. వాసిరెడ్డి పద్మ బజారు మనిషిలా మాట్లాడుతున్నారన్నారు.నువ్వు అరేయ్ అంటే మేం ఒసేయ్ అనలేమా..?. జగన్ను వాసిరెడ్డి పద్మ రోడ్డున పడేశారు. మా ప్రజాపోరాటంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మేకప్ వేసుకొని ఆస్పత్రికి వచ్చి అబద్ధాలు చెప్పారు. రాజకీయ కక్షతోనే మాకు నోటీసులు ఇచ్చారు. వాసిరెడ్డి పద్మను పదవి నుంచి తొలగించేవరకు న్యాయపోరాటం చేస్తాం. వ్యక్తిగత కక్షతో ఇచ్చిన నోటీసులకు మేము వెళ్లే ప్రసక్తే లేదు. ఈనెల 27 లోపు అధికారులపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తాం. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తీరు హేయం. బాధితురాలికి అండగా నిలవడం మా తప్పా?. ఘటన జరిగిన మూడ్రోజులైనాక బాధితురాలి పరామర్శకు వచ్చారు. వాసిరెడ్డి పద్మ నోటీసులకు స్పందించేదే లేదు. దీనిపై మేం న్యాయ పోరాటానికి సిద్ధం. బాధితులకు అండగా ఉండడం చంద్రబాబు చేసిన తప్పా?’ అని వాసిరెడ్డి పద్మపై బోండా ఉమా ప్రశ్నల వర్షం కురిపించారు.